ప‌శ్చిమ‌బెంగాల్‌లో పాఠ‌శాల‌లు మ‌రో రెండు నెల‌లు మూసే ఉంటాయ‌ని ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు,  లాక్‌డౌన్ అమ‌లు లాంటి ప‌రిణ‌మాల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆమె తెలిపారు. అయితే లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూనే రాష్ట్రంలోని బేక‌రీల‌ను తెరిపించే ఆలోచ‌న ఉంద‌ని ఆమె చెప్పారు. ఇక, రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో ఆరు క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని ఆమె వెల్ల‌డించారు. దీంతో రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95కు చేరింద‌ని బెంగాల్ సీఎం మ‌మ‌త వెల్ల‌డించారు.  క‌రోనా వైర‌స్ క‌ట్టడికి దేశ వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వ తేదీ త‌ర్వాత కూడా పొడిగించేఅవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు లాక్‌డౌన్ పొడిగింపు దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్నారు.

 

ఈ రోజు 13 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కీల‌క విష‌యాల‌ను ముఖ్య‌మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి వ‌చ్చే మూడు నాలుగు వారాలు అత్యంత కీల‌క‌మ‌ని, అంద‌రం ఏకాభిప్రాయంతో ఐక్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను మ‌రింత క‌ట్టుదిట్టంగా అమ‌లుచేయాలని, ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించేలా చూడాల‌ని అన్నారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మ‌మ‌తా బెన‌ర్జీకూడా లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని సూచించారు. ఈ నేప‌థ్యంలో ఆమె విద్యాసంస్థ‌ల పునఃప్రారంభంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో మ‌రో రెండు నెల‌ల‌పాటు అంటే జూన్ 10వ తేదీ త‌ర్వాత పాఠశాల‌ల‌ను ప్రారంభిస్తామ‌ని ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ వెల్ల‌డించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: