కొరియన్ల స్టైలే వేరప్పా.. ప్రపంచం అంతా ఒకవైపు పోతుంటే.. కొరియన్లు మాత్రం మరోవైపు వెళ్తారు. అందరూ నడిచే దారిలో అస్సలే నడువరు. మా రూటే సపరేట్ అంటారు. ఓ వైపు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపివేస్తుంటే.. ఉత్తర కొరియా మాత్రం హాయిగా క్షిపణి పరీక్షలు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇక దక్షిణ కొరియా ఏకంగా పార్లమెంట్ ఎన్నికలనే నిర్వహించి ప్రపంచ నోరెళ్ల బెట్టేలా చేసింది. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ విజయవంతంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించి దక్షిణ కొరియా చరిత్ర సృష్టించింది. ఇది చూసిన ప్రపంచ ప్రజలు.. బాబోయ్! ఇదేం పోయేకాలం అంటున్నారు. అయితే.. పోలింగ్ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 14 వేల పోలింగ్ బూత్లను క్రిమిరహితం చేశారు.
అయితే.. ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద పరస్పరం సుమారు మూడు అడుగుల దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ బూత్లోకి వెళ్లేముందే ఓటర్ల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించి, జ్వరం ఉన్నవారిని లోపలికి అనుమతించలేదు. ఆ తర్వాత బూత్లోకి వెళ్లాక చేతులను శానిటైజ్ చేసుకుని, అధికారులు ఇచ్చిన గ్లవ్స్ వేసుకుని ప్రజలు ఓటేశారు. నిజానికి 300 మంది సభ్యుల నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే బుధవారమే జరగాల్సి ఉంది. అయితే, అక్కడ ముందుగానే ఓటేసే అవకాశం ఉంది. దాంతో శుక్ర, శనివారాల్లోనే పోలింగ్ నిర్వహించారు. చూశారా.. కొరియన్లు ఎంత తేడానో..! ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక తమదేశంలో మాత్రం కరోనా లేదు.. గిరోనా లేదని ఉత్తర కొరియా అంటోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.