డబ్బు..డబ్బు..డబ్బు.. ఈ ప్రపంచం మొత్తం డబ్బుచుట్టే తిరుగుతోంది. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారో.. ధనముంటే అప్పలమ్మనే అప్సరస అని పొగిడేస్తారో.. అని అన్నాడో సినీ కవి. డబ్బు ఎవరికి అవసరం ఉండదు చెప్పండి..! డబ్బుతో ఎవరికి పనుండదు! రోడ్డు మీద పోతుంటే.. నోట్లు కనబడితే చాలు.. అటు ఇటుగా చూసి టక్కున జేబులో వేసుకునే రకాలే ఎక్కువగా ఉంటారు మనలో. ఇక ఎవరో ఒకరు ఆ డబ్బులెవరివో తెలుసుకుని అప్పగించేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ.. ప్రస్తుత కరోనా కాలంలో మాత్రం.. నోట్లు కనిపిస్తే.. అమ్మో అంటున్నారు.. నోట్లతో కూడా కరోనా వ్యాపిస్తుందన్న భయంతో ప్రజలు భయపడుతున్నారు. ఆ గ్రామస్తులు రోడ్డుపై కనిపించిన నోట్లను చూసి గజగజ వణికిపోయారు. వెంటనే ఏం చేశారో.. ఇది ఎక్కడ జరిగిందో చూద్దాం..
కొద్దిరోజులు కరోనా వైరస్ విషయంలో అనేక తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి.. వాస్తవిక విషయాలను పక్కన బెట్టి..కరోనా వైరస్ ఇలా వస్తుంది.. అలా వస్తుంది.. అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొందరు. ఈ ప్రచారానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇటీవల వైరస్ వ్యాప్తి చేస్తున్నామంటూ కొందరు కరెన్సీ నోట్లకు ఉమ్మిరాస్తూ, తమ ముఖానికి, ముక్కుకు రాసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రజలకు మరింత భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే కర్నాటక రాష్ట్రం కల్బుర్గి జిల్లా ఆళంద తాలూకా సుంటనురు గ్రామంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. సుంటనురు గ్రామంలో ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాసేపు ఫోన్లో మాట్లాడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత రోడ్డుపై నోట్లు పారవేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని స్థానిక మహిళలు గమనించారు. అయితే నోట్లను పిల్లలు ఎవరూ పట్టుకోకుండా వెంటనే మట్టితో కప్పేశారు. ఆ తర్వాత గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో.. వెంటనే వారొచ్చి ఆ నోట్లను కాల్చి బూడిద చేసేశారు.