కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలని, లాక్డౌన్ నిబంధనలను గౌరవించాలని, ఇదే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అధికారులు కూడా నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా పలుచోట్ల ప్రజలు నిబంధనలను పెద్దగా పట్టించుకోవడం లేదు. సామాజికదూరం పాటించడం లేదు. ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా మాస్క్లు ధరించడం లేదు. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.
నగరంలో ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రజలు ఇక నుంచి తప్పనిసరిగా మాస్కు ధరించాలని.. లేని పక్షంలో రూ. రూ. 5000 జరిమానా చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. జరిమానా లేకుంటే మూడేళ్ల శిక్ష విధిస్తామని అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా ఆదివారం తెలిపారు. ఇక ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి ప్రతీ ఒక్కరు మాస్క్లు ధరించాలని ఆయన ఆదేశించారు. లేదంటే జరిమానా, జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ నిర్ణయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మాస్కులుగా తువ్వాల, చేతిరుమాలు, బట్ట నుంచి చేసినదేదైనా ప్రజలు ధరించవచ్చని ఆయన సూచించారు. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా అహ్మదాబాద్ నగరంలో 266 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క ఈ నగరంలోని 11మంది మరణించారు. మొత్తం గుజరాత్ రాష్ట్రంలో 22 మంది కరోనాతో మరణించగా.. 432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.