భర్త మృతి.. విధిలేని పరిస్థితిలో ఆ పని చేసిన భార్య
కరోనా.. కరోనా.. కరోనా.. మానవాళికి ఎన్నో విషాదాలను విగుల్చుతోంది ఈ మహమ్మారి. విశ్వమంతా మారణహోమం.. ఎటు చూసినా కన్నీటి గాథలే.. ఎటు చూసినా కన్నీటిసంద్రాలే.. ప్రపంచ మొత్తం దుఃఖమయమే..! అయిన వాళ్లు మరణించినా.. వెళ్లలేని స్థితి.. చివరిచూపుకూ నోచుకోలేని దయనీయ పరిస్థితి! ఆఖరికి అంత్యక్రియలకూ నలుగురైదుగురికే అవకాశం. బంధుమిత్రులందరూ అంత్యక్రియలను వీడియోలోనే చూడాల్సిన స్థితి. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. తెలంగాణలో కూడా ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. కొడుకు ఉన్నా.. తండ్రికి తలకొరివి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన గ్రామాన్ని మొత్తం దుఃఖసాగరంలోకి నెట్టింది. అయ్యో.. ఇలాంటి రోజులను తామెన్నడూ చూడలేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా పందిల్ల గ్రామానికి చెందిన రాములుకు భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడు గుజరాత్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. శనివారం అర్ధరాత్రి రాములు మృతి చెందాడు. ఈ విషయాన్ని కుమారుడికి తెలిపారు. అయితే.. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో అతడు గ్రామానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామస్తులు రాములు అంత్య క్రియలు నిర్వహించారు. విధిలేని పరిస్థితిలో భార్య తలకొరివి పెట్టింది. ఈ దృశ్యాన్ని గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలను కుమారుడు చూసి దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. అంత్యక్రియలను బంధువులందరూ వీడియలోనే చూడాల్సి వచ్చింది. అయ్యో దేవుడా.. ఇలాంటి రోజులను తామెన్నడూ చూడలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి విషాద ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సింగపూర్లో ఏపీకి చెందిన వ్యక్తి మృతి చెందితే అంత్యక్రియలను వీడియో కాల్లో భార్యకు చూపించారు.