కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఒక్క అత్యవసేలు, నిత్యావసర సరుకుల రంగాలు తప్ప మిగతావి మొత్తం తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఇక ఇందులో కరోనా ప్రభావం మొదటగా విద్యారంగంపైనే పడింది. విద్యాసంస్థల్లో విద్యార్థులందరూ గుమిగూడే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా మూసివేశారు. ఆ తర్వాత కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే.. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంసెట్ సహా రాష్ట్రంలో మే నెలలో జరుగాల్సిన అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కొత్త తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. కాగా, ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మే 5 వరకు గడువు ఉన్నట్లు ఆయన తెలిపారు.
అలాగే.. తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 23వ తేదీ వరకు దూరదర్శన్ చానెల్ యాదగిరిలో పాఠ్యాంశాలు బోధించేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం, సాయంత్ర రెండు దశల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే.. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న శనివారంరాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఉస్మానియా విద్యార్థులకు కూడా ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు.ఈ మేరకు ఉస్మానియా వీసీ, ఇతర అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా మొదటి నుంచీ కూడా విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోంది.