కరోనా వైరస్.. కంటికి కనిపించకుండా.. అంతుచిక్కని మార్పులతో ఈ ప్రపంచాన్నికుదిపేస్తోంది. ప్రభుత్వాలను, అధికార యంత్రాంగాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇలా తగ్గినట్టే తగ్గి.. అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ఈ మహమ్మారిని అంచనా వేయలేక ప్రభుత్వాలు నానా కష్టాలు పడుతున్నాయి. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు కాగానే.. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటుండగానే.. ఒక్కసారిగా అంతకుమించి కేసులు నమోదు కావడంతో కంగుతింటున్నాయి. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షాకింగ్కామెంట్స్ చేశారు. * కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతోంది. ప్రజలు, అధికారులు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు సామాజిక దూరం పాటించాలి. తెలంగాణలో ఆదివారం కొత్తగా 28 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 531కి చేరింది. అందుకే అందరం మరింత అప్రమత్తంగా ఉండాలి* అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, బాధితులకు అందుతున్న చికిత్స, లాక్డౌన్ అమలు తీరు, పేదలకు అందుతున్న సాయం, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలంగాణలో పరిణామాలు గమనిస్తుంటే కరోనా వైరస్ వ్యాప్తి ఆగడంలేదని స్పష్టమవుతోందంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు స్వీయంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితం అయితేనే కరోనా వ్యాప్త నివారణ సాధ్యమని ఆయన చెప్పారు.