కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతోపాటు, ఎక్కువ మరణాలు కూడా ఈ దేశంలోనే సంభవిస్తుండటం అక్కడి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో మొన్నటి వరకు ఇట లీ తొలి స్థానంలో ఉండగా, ఇప్పుడు అమెరికా ఈ స్థానానికి ఎగబాకింది. కొవిడ్-19 వైరస్ సోకిన వారిలో గంటకు 83 మంది చొప్పున మరణిస్తున్నట్టు అక్కడి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం 5.45 లక్షల మంది పాజిటివ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
కరోనాపై ఆదిలో ఉదాసీనంగా వ్యవహరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యం వల్లే ఇంత పెద్ద విపత్తు సంభవించిందని అమెరికా మీడియా దుయ్యబట్టింది. కొవిడ్-19పై అధికార వర్గాలు ట్రంప్ను ముందుగానే హెచ్చరించినా ఆయన పట్టించుకోకపోవడం వల్లే మృత్యుఘోష పెరిగిందని, పక్కా ప్ర ణాళికను రూపొందించుకుని పోరుకు సన్నద్ధం కావడంలోనూ ఆయన విఫలమయ్యారని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.
అత్యంత విలువైన మూడు వారాల సమయాన్ని అధ్యక్షుడు వృథా చేశారని తెలిపింది. మరో పత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ కూడా ఇదే అభిప్రాయం వెల్లడించింది. వైద్య అధికారులు, ఇంటిలిజెన్స్ హెచ్చరించినా ట్రంప్ మేల్కొనలేదని నిప్పులు చెరిగింది.