కరోనా మహమ్మారిపై పోరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా విరాళాలు అందుతున్నాయి. ఇందులో ప్రధానంగా కేంద్రప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు సమకూరుతున్నాయి. పెద్దపెద్ద కంపనీలేకాదు.. సెలబ్రిటీలు, సాధారణ వ్యక్తులు కూడా లక్షల్లో విరాళాలు అందజేస్తున్నారు. అయితే.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)లో జమ చేస్తున్నాయి.
కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విరాళాలను ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్(పీఎంఎన్ఆర్ఎఫ్)కు కేటాయించకుండా ప్రత్యేకంగా ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (పిఎం-కేర్స్) నిధిని ఏర్పాటు చేసింది. ఇందులో విరాళాలను జమ చేస్తోంది. అయితే.. పీఎంఎన్ఆర్ఎఫ్ ఉండగా.. పీఎం-కేర్స్ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఎందుకు ఏర్పాటు చేశారంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రధానమంత్రి మోడీకి లేఖకూడా రాశారు. అయితే.. ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (పిఎం-కేర్స్) నిధిని ధర్మకర్తలు నియమించిన స్వతంత్ర నిపుణులు ఆడిట్ చేయనున్నట్లు తాజాగా తెలుస్తోంది. దీంతో ఈ నిధికి ఎన్నివేల కోట్లు వచ్చాయో త్వరలోనే తెలియనుంది.