కరోనాతో మందుబాబులకు మహా పెద్ద కష్టాలు వచ్చి పడ్డాయి. లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూత పడ్డాయి. దీంతో మద్యం లేక మందు బాబులు పిచ్చివాళ్ళవుతున్నారు. ఇక ఇదే సమయంలో కల్లుకు గిరాకీ బాగా పెరిగింది. కల్లు కోసం జనాలు తాటివనాల వైపు పరుగులు పెడు తున్నారు. దీంతో కల్లుకు ఫుల్ డిమాండ్ పెరిగింది. కల్లు గీత కార్మికులు కల్లు ధరలను అమాంతం పెంచేశారు.
రెండు రోజుల ముందు బుకింగ్ చేసుకుంటే తప్ప కల్లు దొరికే పరిస్థితి లేదు. కల్లు కోసం తాటి వనాల వద్ద జనాల పడిగాపులు గాస్తున్నారు. సందట్లో సడేమియా అంటూ కల్లుగీత కార్మికులు కల్తీలకు పాల్పడుతున్నారు. ఇక కల్తీ కల్లు తాగి జనాలు అనారోగ్యాలకు గురవుతున్నారు .
కల్లు ఎలా ఉన్నా సరే జనాలు కావాలని పోటీ పడటంతో కల్తీ చేసి మరీ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో కల్లు గీత కార్మికులకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది . నిన్నా మొన్నటి దాకా రూ.30 గా అమ్మిన కల్లు సీసా ఇప్పుడు ఏకంగా 50 రూపాయలకు చేరుకుంది. ఇక ఎమర్జెన్సీ అంటే ధర ఇంకో రెండు రెట్లు అధికంగా పెట్టాల్సి వస్తోంది .