లాక్డౌన్ పై కొనసాగుతున్న సస్పెన్స్కు రేపటితో తెరపడనుంది. లాక్డౌన్ కొనసాగించాలా వద్దా అన్న విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం పది గంటలకు కీలక ప్రకటన చేయనున్నారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ గడువు రేపటితో ముగియనుంది. దీంతో ప్రధాని మోడీ కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
అయితే.. మోడీ దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు..? లాక్డౌన్ను పొడిగిస్తారా..? పొడిగిస్తే ఎలాంటి మినహాయింపులు ఇవ్వనున్నారు.. ? ఇప్పుడివే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
కరోనా కేసుల సంఖ్య దేశంలో సుమారు పది వేలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకూ 273 మంది చనిపోయారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతుండటంతో లాక్డౌన్ కొనసాగించడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే అ నేక రాష్ట్రాలు నెలాఖరు వరకూ లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ తరుణంలో ప్రధాని చేయబోయే ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్థిక వ్యవస్థను బతికించుకోవడం కోసం లాక్ డౌన్ నుంచి వ్యవసాయం, వ్యవసాయ ఆదారిత , రవాణా, ఫుడ్ మా న్యుఫ్యాక్చరింగ్ రంగాలకు ఆంక్షలను సడలించనున్నట్లు సమాచారం.