రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డకట్ట వేసేందుకు బీహార్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని భగల్పూర్ జిల్లాలో ప్రజలందరూ మాస్కులు ధరించాల్సిందేనని అధికారులు నిబంధన విధించారు. ఈ నిబంధన సోమవారం నుంచే అందుబాటులోకి వస్తుందని కూడా ప్రకటించేశారు. ఇదే రకమైన నిబంధనలను పాట్నాతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో కూడా అమలు చేస్తున్నారు.
తాజాగా భగల్పూర్, పాట్నా ప్రాంతాల్లో ఉండే పెట్రోల్ డీలర్లు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాస్కులు ధరించి వస్తేనే పెట్రోలు పోస్తామని, లేదంటే పెట్రోల్ పోయమని తేల్చి చెబుతున్నారు. వీటితో పాటు ముజఫర్ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడానికి కూడా నిషేధించారు.
అదే విధంగా ముజఫర్ పూర్, ముంగేర్, ఖంగారియా, పూర్ణియా, బేగుసరాయ్ ప్రాంతాల్లో గుట్కా, సిగరేట్లతో పాటు పొగాకు విక్రయాలపై కూడా నిషేధం వి ధించారు. ఈ నిబంధనలను కాదని పొగాకు ఉత్పత్తులను అమ్మితే రెండు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ఆయా జిల్లా కలెక్టర్లు అధికారికంగా ప్రకటించారు.