ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం పెరుగుతూనే ఉంది. సోమవారం నాడు మరో 19 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 439 కి చేరింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 866 శాంపిల్స్ను పరిశీలించారు. ఇందులో 847 కేసుల్లో నెగెటివ్ రాగా 19 కేసుల్లో పాజిటివ్ వచ్చిందని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసుల్లో 11 కేసులు ఒక్క గుంటూరు జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. దీంతో ఆ జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య 93కి చేరింది.
ఇక నెల్లూరులో 4, చిత్తూరులో 2, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8755 శాంపిల్స్ పరిశీలించగా 8,316 కేసుల్లో నెగెటివ్ వచ్చింది. 439 కేసులు కరోనా పాజిటివ్గా నమోదయ్యాయి. ఇప్పటివరకు కోవిడ్-19 బారినపడి 12 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఏడుగురు మరణించారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 420గా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.