లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు, రైతులు ఇబ్బందులుపడకుండా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో గ్రామాలు, పట్టణాల్లో 20 వేలకు పైగా వైఎస్సార్ జనతా బజార్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రైతులకు ఇవి అతి పెద్ద స్థానిక మార్కెట్లుగా అందుబాటులో ఉండబోతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్ చైన్, ప్రాసెసింగ్ నెట్వర్క్ను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అటు రైతులు, ఇటు ప్రజలకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉండేలా జనతా బజార్లకు రూపకల్పన చేస్తున్నారు.
అంతేగాకుండా.. వీటి నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తున్నారు. ఏపీలో 11 వేలకు పైగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉండగా... వీటిలో వైఎస్సార్ జనతా బజార్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వార్డు సచివాలయాల పక్కన కూడా జనతా బజార్లు ఉండేలా చూస్తున్నారు. ఇక మండల కేంద్రాల్లో పెద్ద స్థాయిలో జనతా బజార్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఏర్పడుతున్న కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.