లాక్డౌన్ సడలింపులపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు పొడిగింపుకే ఓటెయ్యగా.. ప్రధాని మోడీ మాత్రం తన నిర్ణయంపై మౌనంగా ఉన్నారు. తొలిదశ లాక్డౌన్ గడువు ఏప్రిల్ 14న ముగియనుంది. దీంతో మంగళవారం ఉదయం పది గంటకు ఆయన జాతి నుద్దేశించి ప్రసంగించనున్నారు.
అయితే ఆయన ఏ నిర్ణయం తీసుకోనున్నారనే దానిపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రోజురోజుకూ కరోనా కేసులుపెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాలపాటు అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగిస్తారని తెలుస్తోంది.
ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు లాక్డౌన్లో కొన్ని నిబంధనలను సడలించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయప డుతున్నారు. రెడ్జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ల ఆధారంగా లాక్డౌన్ నిబంధనలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రధాని మోడీకి లేఖ రాశారు. వ్యవసాయం, దాని ఆధారిత రంగాల కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నిర్ణయం కోసం దేశప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.