దేశంలో రోజు రోజుకీ కరోనా మహమ్మారి ప్రభావం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో గత నెల 24 న లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నేటి తో లాక్ డౌన్ ముగియనుంది.. కానీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం లాక్ డౌన్ పొడిగించాలని.. కరోనా పూర్తి కట్టడి కాలేదని అభిప్రాయ పడుతున్నారు. మొన్న ప్రధాని మోదీతో ఇదే విషయంపై మాట్లాడారు. నేడు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయనున్న వేళ, అంతకన్నా ముందుగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నా ప్రియమైన దేశ ప్రజలారా.. అంటూ ప్రారంభమైన ఈ వీడియోలో, కరోనా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రతి పౌరుడూ సహకరించాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా కరోనాకు దూరంగా ఉండవచ్చని అన్నారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ భార్యా పిల్లలనూ, తల్లిదండ్రులనూ వదిలి కరోనాపై పోరాడుతున్నారని, వారందరికీ ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. వైరస్ భయాందోళనలు తగ్గేంత వరకూ ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అన్నారు. ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ కూడా ప్రజలంతా శాంతి, సహనం, సంయమనం పాటిస్తున్నారని ఆమె అన్నారు.
అయితే కరోనా మొదలైనప్పటి నుంచి కేంద్రం తీసుకుంన్న అన్ని చర్యలు ఎంతో మెచ్చుకునే విధంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే, ఎటువంటి ముందస్తు సన్నాహాలు లేకుండా దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారని, దీనివల్ల దేశం నష్టపోతోందని ఆరోపించారు.