కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు ప్రధాని నరేంద్రమోడీ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ అద్భుతంగా పోరాడుతోందని డబ్ల్యూహెచ్వో ప్రశంసించింది. దేశంలో కరోనా వైరస్ మరింతగా విస్తరించకుండా భారత ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొంటున్నదని ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్ పూనం కేత్రపాల్సింగ్ అన్నారు.
*భారత చర్యల ఫలితాల గురించి ఇప్పుడే మాట్లాడితే తొందరపాటు అవుతుంది. కానీ ఆరువారాల లాక్డౌన్తోపాటు సామాజిక దూరం, వైద్యసేవల విస్తరణ, రోగులకు ఐసోలేషన్, సకాలంలో బాధితులను గుర్తించడంలో భాతర్ చూపుతున్న వేగం వల్ల వైరస్ వ్యాప్తి అరికట్టడం సాధ్యమవుతుంది* అని పూనం కేత్రపాల్సింగ్ పేర్కొన్నారు. నిజానికి.. కరోనాను తరిమికొట్టేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలను ముందునుంచీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మెచ్చుకుంటోంది. అనేక దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను అందించడం, పలు దేశాలకు ఆహారధాన్యాలను అందించడం వంటి చర్యలతో ప్రపంచ దేశాలు భారత్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.