ప్రజలు సామాజిక దూరం, స్వీయనియంత్రణ పాటించాలని.. ఈ రెండు అంశాలే మనల్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడుతాయని ఓ వైపు ప్రభుత్వాలు, అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ.. ముంబైలో బాంద్రా బస్టాండ్ వద్దకు ఒక్కసారిగా మంగళవారం సాయంత్రం 4గంటలకు వేలాదిమంది వలస కార్మికులు తరలివచ్చారు. తమ సొంతూళ్లకు తరలివెళ్లేందుకు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. తమను సొంత గ్రామాలకు తరలించాలని డిమాండ్ చేరు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు వేలాదిగా బస్టాండ్కు చేరుకున్నారు.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగించడంతో వలస కార్మికులు ఈ ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఒకదశలో కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేసినట్లు తెలుస్తోంది. తమను ఎవరూ పట్టించుకోవడం. లేదని. తాము ఇక్కడ ఎలా బతకాలని వలస కార్మికులను నిలదీసినట్లు వార్తలు వస్తున్నాయి. చివరికి వారిని పోలీసులు చెదరగొట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేయించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఓవైపు ముంబైలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో బాంద్రా ఘటనతో కలకలం రేగుతోంది.