బాంద్రా ఘటన ముంబైలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. అయితే.. రైళ్లు ప్రారంభిస్తారనే పుకార్ల కారణంగా బాంద్రా ఘటన జరిగిందని ఆయన చెప్పారు. తప్పుడు ప్రచారం వల్లే వలస కార్మికులు అక్కడికి ఒక్కసారిగా చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే.. వలస కార్మికులందరూ వారి స్వస్థలాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని, వలస కార్మికులను ఆదుకుంటామని, వారికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని ఆయన అన్నారు. ఉదయం 10గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశింశి మాట్లాడుతూ.. మే 3వ తేదీవరకు లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. సామాజిక దూరం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏం జరిగిందో తెలియదుగానీ.. ముంబైలో బాంద్రా పశ్చిమ బస్టాండ్ వద్దకు మంగళవారం సాయంత్రం 4గంటలకు వేలాదిమంది వలస కార్మికులు ఒక్కసారిగా తరలివచ్చారు. తమ సొంతూళ్లకు తరలివెళ్లేందుకు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. తమను సొంత గ్రామాలకు తరలించాలని డిమాండ్ చేశారు. వీరందరూ కూడా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు. ఇలా ఒక్కసారిగా వేలాదిగా బస్టాండ్కు చేరుకోవడంతో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఒకదశలో కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేసినట్లు తెలుస్తోంది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని. తాము ఇక్కడ ఎలా బతకాలని వలస కార్మికులను నిలదీసినట్లు వార్తలు వస్తున్నాయి. చివరికి వారిని పోలీసులు చెదరగొట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేయించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఓవైపు ముంబైలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో బాంద్రా ఘటనతో కలకలం రేగుతోంది.