మహారాష్ట్రలో కొవిడ్-19 కలకలం రేపుతోంది. తాజాగా.. 13ఏళ్ల బాలికను బలితీసుకుంది. వడోదరకు చెందిన ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. వడోదరలో ఇద్దరికి పాజిటివ్ సోకగా.. అందులో బాలిక మృతి చెందింది. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 2334 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 230 మంది అంటే సుమారు 10శాతం మంది కోలుకున్నట్లు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వెల్లడించారు. ప్రధానంగా ముంబై కేంద్రంగా వైరస్ రెచ్చిపోతోంది. ఇక్కడే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ముంబై, పూణే హాట్స్పాట్లలో పరీక్షా కేంద్రాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. కంటైన్మెంట్ జోన్లపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని, కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా వైరస్ కట్టడికిలో మహారాష్ట్ర దేశానికి మార్గదర్శకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే వైరస్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో అరికడుతామని ఆయన అన్నారు. ప్రధానంగా వైరస్ పది జిల్లాల్లో ఉందని.. వీటన్నింటికీ కరోనా రహిత జిల్లాలుగా మారుస్తామని చెప్పారు.