ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకు వైద్యసేవలు అందించిన వైద్య సిబ్బంది ఇబ్బందులను తీర్చేందుకు, పేషెంట్లకు అందించే చికిత్సలో ఏమైనా సందేహాలు ఉన్నా.. నివృత్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కోవిడ్ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను, సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఏపీలో నాలుగు కోవిడ్–19 ఆస్పత్రులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నెల్లూరు, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రుల్లో కరోనా వైరస్ బాధితులకు మాత్రమే వైద్యసేవలు అందిస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యిమందికి పైగా వైద్యసిబ్బంది పనిచేస్తున్నారు.
ఈ నాలుగు ఆస్పత్రుల్లో సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే 91008 59355, 91008 64322 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. పాజిటివ్ రోగులకు ట్రీట్మెంట్ ప్రొటోకాల్స్కు సంబంధించి సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవచ్చు. వెంటిలేటర్ మేనేజ్మెంట్కు సంబంధించిన విషయాల కోసం కూడా ఫోన్చేయవచ్చు. వైద్య ఉపకరణాలు ఏవైనా అవసరమైనప్పుడు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. ఒకవేళ పేషెంట్ పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు ఎలాంటి వైద్యం అందించాలన్నదానిపై ఈ నంబర్లకు ఫోన్ చేసి సలహాలు తీసుకోవచ్చు. ఈ రెండు నంబర్లు రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించి ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ కంట్రోల్ సెంటర్లో వైద్యనిపుణులు డీఎంఈ, ప్రజారోగ్య సంచాలకులు, ఐఏఎస్ అధికారులు ఉంటారు.