కరోనా.. ఈ పేరు వింటేనే సగం ప్రాణం పోతుంది..! అంతలా బీభత్సం సృష్టిస్తోంది. కానీ.. పలుచోట్ల అదే కరోనాను పలువురు సులువుగా జయిస్తున్నారు. ఏపీలో ఓ కుటుంబం కూడా కరోనా మహమ్మారిపై గెలిచి నిలిచింది. అది ఎక్కడ అంటే.. విశాఖ జిల్లా పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామంలో.. ఆ వివరాలేమిటో చూద్దాం.. లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడికి మార్చి 22న కరోనా పాజిటివ్గా అని తేలింది. అతడి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్కు తరలించారు అధికారులు.
ఆ తర్వాత షాకింగ్ న్యూస్.. బాధిత యువకుడి కుటుంబంలో మొత్తం నలుగురికి కూడా కరోనా సోకింది. ఒకే ఇంట్లో నలుగురికి కరోనా సోకడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై గ్రామంలో ఆంక్షలు విధించారు. అనంతరం బాధితుల్లో ఇద్దరికి కరోనా నెగిటివ్గా తేలడంతో కొద్ది రోజుల క్రితం డిశ్చార్జి చేశారు. మిగతా ఇద్దరిని సోమవారం రాత్రి డిశ్చార్జి చేశారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గ్రామస్తులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కరోనాపై గెలిచిన ఈ నలుగురు కూడా హోం క్వారంటైన్లో 14 రోజులపాటు జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణలో ఉంటారు.