కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడం లేదు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ సాయికృపకాలనీకి చెందిన ఏడేండ్ల బాలుడికి కూడా కొవిడ్-19 సోకడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. కరోనా ఎలా సోకిందనే విషయంపై అధికారుల్లో ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం బాలుడికి కరోనా నిర్ధారణ కాగానే అతడి కుటుంబసభ్యులను ఐసొలేషన్కు తరలించారు. అయితే.. మంగళవారం బాలుడి అమ్మమ్మ, తాత, తల్లి, చెల్లికి కరోనా నిర్ధారణ పరీక్షలో నెగెటివ్ వచ్చింది.
అయితే.. తండ్రి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉన్నది. అవి వస్తే బాలుడికి ఎలా పాజిటివ్ వచ్చిందనే అంశంపై స్పష్టత వస్తుందని జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్ చెప్పారు. ఒకవేళ తండ్రికి నెగెటివ్ వస్తే జర్మనీ నుంచి వచ్చాక బాలుడు ఎవరెవరిని కలిశారు? ఎవరి ఇంటికి వెళ్లాడనే కోణాల్లో విచారిస్తామన్నారు. బాలుడితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్కు తరలిస్తున్నామన్నారు. ఈ ఘటనతో గ్రామంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఎవరికీ అంతుచిక్కకపోవడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు.