కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో అనేక రంగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగం కుదేలైంది. ఇందులోనూ మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమలు అయితే కోలుకోలేని దెబ్బతిన్నాయి. వందలు, వేల సంఖ్యలో కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని, ప్రత్యేక ప్యాకేజీని ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. కొవిడ్-19 ఎంఎస్ఎంఈ పథకాన్ని రూపొందించి, దీని కింద చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం సాయం అందజేస్తుందని పలువురు బీజేపీ నాయకులు అంటున్నారు.
ఈ కష్టకాలంలో ఈ పరిశ్రమల్లో కార్మికులకు జీతభత్యాలు ఇవ్వడానికి. ఇతరత్రా అవసరాలకు ఈ ప్యాకేజీని ఇస్తుందని చెబుతున్నారు. అయితే.. ఆయా పరిశ్రమలకు ఇప్పుడున్న రుణమొత్తానికి అదనంగా 20శాతం తక్షణమే ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందని అంటున్నారు. దీనిని రెండు నెలల్లో తీర్చవచ్చని, లేదా పాత రుణంలో కలిపివేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రుణం రూ.5లక్షల రుణం ఉంటే వెంటనే లక్ష రూపాయలు, రూ.10లక్షల రుణం ఉంటే రూ.2లక్షలు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.