రాష్ట్రంలో కరోనా వైరస్ తాజా పరిస్థితులు, లాక్డౌన్ అమలు, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు, తదితర అంశాలపై బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గన్నారు. కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రూపొందించే ప్రత్యేక మార్గదర్శకాలపై చర్చించారు.
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ రెండో దశకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయగా.. వాటిపై ప్రధానంగ చర్చించారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హాట్స్పాట్ జిల్లాల్లో తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. దీంతో రేపటి నుంచి ఈ జిల్లాల్లో లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. ఎంతమందికైనా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి, వారికి చికిత్స అందించడానిక ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 20వ తేదీ వరకు తెలంగాణలో యథావిధిగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.