కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై వస్తున్న వార్తలపై ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్పందించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో కేంద్రహోంశాఖకు లేఖ రాశానని, ఆ లేఖపై థర్డ్పార్టీ వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేశ్కుమార్ పేర్కొన్నారు. ఆ లేఖను తానే స్వయంగా రాశానని ఆయన స్పష్టం చేశారు. తాను రాసిన లేఖను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ధ్రువీకరించారని ఆయన తెలిపారు. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని సూచించారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు..ప్రభుత్వ డాక్యుమెంట్ల ఫోర్జరీ జరిగిందంటూ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఏకంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్సవాంగ్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ రాసిన లేఖకు.. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంగా ఉన్న లేఖలో ఉన్న సంతకాలకు ఏ మాత్రమూ పొంతన లేదని పేర్కొంటూ డీజీపీకి రాసిన లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు.