భారత్లో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 12, 380కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 414 మంది మరణించారు. ఇక 10,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 1,488 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్యధిక కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు ఉన్నాయి. ఇందులో ముంబై నగరం కరోనా వైరస్ కు హాట్స్పాట్గా మారింది. నగరంలో రోజురోజుకూ కొత్త కొత్త ప్రాంతాలకు వైరస్ వ్యాపిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలోని 207 జిల్లాలను హాట్స్పాట్లుగా ప్రకటించింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధలను మరింత కఠినంగా అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఏప్రిల్ 20వ తేదీ తర్వాత లాక్డౌన్ నిబంధనల్లో కొంత మేరకు సడలింపులు ఉంటాయని కేంద్రం ప్రభత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.