సీనియర్‌ టిడిపి నాయకుడు, మాజీ ఎంపి వి.తులసీరాం (86) కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ రోజు ఆయ‌న త‌న స్వ‌స్థ‌లం అయిన రంగారెడ్డి జిల్లాలోని శివ‌రాంప‌ల్లిలోనే మృతి చెందారు. స‌ర్పంచ్‌గా రాజ‌కీయ జీవితం ప్రారంభించిన ఆయ‌న ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. ఇక ఎన్టీఆర్‌కు రాజ‌కీయ స‌ల‌హాదారుల్లో కూడా ఒక‌రిగా కొన‌సాగారు. 1959లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 1971 వరకు కాటేదాన్‌ సర్పంచ్‌గా సుదీర్ఘకాలం కొనసాగారు.

 

ఆ త‌ర్వాత ఆయ‌న రాజేంద్ర‌న‌గ‌ర్ స‌మితి ప్రెసిడెంట్‌గా కూడా ప‌నిచేశారు. తెలంగాణ ప్రజా సమితి తరపున పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1969లో ఎంపీగా ఎన్నికై ఢిల్లీ సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు దగ్గరయ్యారు. పార్టీలో చేరి ఆయనకు రాజకీయ సలహాలు ఇస్తుండేవారు. 1985లో నాగర్‌కర్నూల్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి మూడోసారి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షునిగా కూడా కొన్నాళ్లు పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: