దేశంలో లాక్డౌన్ ఒక్కటే కరోనా వైరస్ కట్టడికి పరిష్కారం కాదని, రాండమ్ పరీక్షలు నిర్వహించినప్పుడే కరోనా వైరస్ను కట్టడి చేయగలమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చాలా నెమ్మదిగా జరగడం వల్లనే కరోనా వైరస్ కొత్త కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు. ఈ మహమ్మారి కట్టడికి ప్రధాని మోడీ మరిన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. దేశంలోని అన్ని పార్టీలు ఒక్కటై కరోనాపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
అలాగే.. దేశంలోని వలస కార్మికులు, కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అంతేకాకుండా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. ఇక్కడ మరొక్క విషయం ఏమిటంటే.. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ పూర్తయ్యాక ఏం చేయాలో ఇప్పుడే వ్యూహరచన చేయాలని ఆయన మోడీకి సూచించారు. లేని పక్షంలో లాక్డౌన్ తర్వాత కూడా కరోనా వైరస్ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.