తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్ తదితరులు హైదరాబాద్పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలను అధికార యంత్రాంగం.. కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో మరింత కట్టుదిట్టంగా లాక్డౌన్ నిబంధనలు అమలు అయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇళ్ల నుంచి ప్రజలు ఎవరూ బయటకు రాకుండా.. వారి ఇళ్లకే సరుకులు అందేలా చూస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఖైరతాబాద్, ఆసిఫ్నగర్ ఏరియాల్లోని కంటైన్మెంట్ జోన్లలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలతో మాట్లాడారు. వారి ఇబ్బందులను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. లాక్డౌన్ నిబంధనలను ప్రజలందరూ పాటించాలని కోరారు.