కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసం నుంచి భారత్ అనేక దేశాలను కాపాడుతోంది. కొవిడ్-19 బారి నుంచి తనను తాను కాపాడుకుంటూనే కరోనా సుడిగుండంలో చిక్కుకున్క దేశాలను గట్టెక్కించేందుకు తనవంతు సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అమెరికాతోపాటు 30 దేశాలకు హైడ్రాక్లోరోక్విన్(మలేరియా నిరోధక) మాత్రలను అందించి తన పెద్దమనసును చాటుకున్న భారత్ తాజాగా.. మరో 25 దేశాలకు కూడా ఈ మాత్రలను అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ బారి నుంచి బాధితులను కాపాడుకునేందుకు అనేక దేశాలు ఈ మాత్రలను వినియోగిస్తున్నాయి.
దీంతో భారత్లో అత్యధికంగా ఉత్పత్తి అయ్యే ఈ మాత్రల కోసం అగ్రరాజ్యాలు భారత్ను వేడుకుంటున్నాయి. ఇక నిన్నటికి నిన్న యూకేకు సుమారు 30లక్షల పారసెటమల్ ట్యాబ్లెట్స్ను కూడా అందించేందుకు అంగీకరించింది. దీంతో భారత్కు యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. యూకేలో మందుల కొరత ఉన్న సమయంలో భారత్ అందించిన సాయం మరువలేనిదని పేర్కొంది. కరోనా బాధితులకు చికిత్స చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది.