కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దాస్ శుక్రవారం ఉదయం 10గంటలకు విలేకరులతో మాట్లాడారు. కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో మానవాళి అతిపెద్ద సవాలును ఎదుర్కొంటోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. *మరణం మధ్యలో జీవితం కొనసాగుతోంది. సత్యాసత్యాల మధ్యలో కొనసాగుతోంది. చీకటిని చీల్చుతూ వెలుగు రేఖ వస్తుంది* అని గాంధీని చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మానవాళి అతిపెద్ద సవాలును ఎదుర్కోందని, ఈ చీకటిని తరిమికొట్టేందుకు మనందరం కంకణబద్ధులం కావాలని, ఆ దిశగా కదలాలని ఆయన సూచించారు.
ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ ఆశాజనకమైన వృద్ధి సాధిస్తుందని అన్నారు. భారత్ 1.9శాతం సానుకూల వృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2021-22లో భారత్ 7.4శాతం వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపర్చడానికి ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. భారత్లో ఏప్రిల్ నెలలో ఆహార ధరలు ఏకంగా 2.4శాతం పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు.