మధ్యప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. లాక్డౌన్ సమయంలో కరోనా హాట్స్పాట్ అయిన ఇండోర్ నగరంలోని హీ రానగర్ రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి కరెన్సీ నోట్లను వెదజల్లడం సంచలనం రేపింది. కరోనా కేసులు అధికంగా వెలుగు చూస్తున్న ఇండోర్ నగరంలోని హీరానగర్ ప్రాంతంలోని వీధి రోడ్డుపై ఓ ఆగంతకుడు 6, 480 రూపాయల కరెన్సీ నోట్లను వెదజల్లారని హీరానగర్ పోలీసులకు సమాచారం అందింది.
రోడ్డుపై పడిన కరెన్సీనోట్లను పట్టుకుంటే కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ప్రజలెవరూ ఈ నోట్లను ముట్టుకోలేదు. పోలీసులు వచ్చి ఈ కరెన్సీనోట్లను శానిటైజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఎవరో కావాలని కరెన్సీనోట్లను రోడ్డుపై వెదజల్లారని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. రోడ్డుపై పడిన కరెన్సీనోట్లలో 500, 200, 100, 50, 20 రూపాయల నోట్లన్నాయి. మొత్తంమీద కరోనా హాట్ స్పాట్ లో కరెన్సీ నోట్లు రోడ్డుపై వెదజల్లిన ఘటన చర్చనీయాంశంగా మారింది.