ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనుకున్నదొక్కటి.. జరిగిందొక్కటి..! లాక్డౌన్ అమలు విషయంలో జగన్ ఊహించిన విధంగా కేంద్ర ప్రభుత్వం జోన్లను ప్రకటించలేదు. నిజానికి.. జిల్లాల వారీగాకాకుండా ప్రాంతాలవారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావించారు. ఇలా చేస్తే.. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతానికే లాక్డౌన్ విధించి, మిగతా ప్రాంతాల్లో సడలింపులు ఇస్తే.. అత్యవసర రంగాల కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. అక్కడి ప్రజల ఇబ్బందులు కూడా తీరుతాయని అనుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆయన లేఖ కూడా రాశారు. అయితే.. ఏప్రిల్ 14 ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ.. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. ఆ మరునాడు మార్గదర్శకాలను విడుదల చేయడం.. కరోనా వైరస్ ప్రభావం ఆధారంగా జిల్లాల వారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించడం చకచకా జరిగిపోయింది.
దీంతో ఏపీలో మొత్తం 13 జిల్లాల్లో 11 జిల్లాలు రెడ్జోన్ కిందకే వచ్చాయి. ఇక మిగిలిన రెండు జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళంలో ఇప్పటివరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. జిల్లాల వారీగా జోన్లు ఉండడంతో ప్రాంతాలవారీగా జోన్లు ఉండే అవకాశం లేకుండాపోయింది. ఒక జిల్లాలో కొంత ప్రాంతానికే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండి.. మిగతా ప్రాంతాల్లో ప్రభావం అస్సలు లేకున్నా.. జిల్లా మొత్తం రెడ్ జోన్ కిందకే వస్తోంది. దీంతో వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లోనూ ఎలాంటి కార్యకలాపాలకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు కేంద్రం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది అశాస్త్రీయ విభజన అని అంటున్నారు.