కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ అమలులో పోలీసులదే అత్యంత కీలక పాత్ర. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఉండలేని పరిస్థితి. విధుల నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో పలువురు పోలీసులు కరోనా బారిన కూడా పడ్డారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీల నుంచి మొదలు సామాన్య ప్రజలందరూ వారి సేవలను కొనియాడుతూ సెల్యూట్ చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉందిగానీ.. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. పాపం పోలీసులు.. వారి కష్టాలు అన్నీఇన్నీ కావు.. అన కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విధుల నిర్వహణలో ఎదురయ్యే పలు సమస్యలు వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.
లాక్డౌన్తో ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. ఈక్రమంలో అత్యవసరం.. ఆపద ఉన్నవాళ్లు ప్రత్యేక పర్మిషన్ తీసుకుని సొంతూళ్లు వెళ్తున్నారు. ముఖ్యంగా ఐనవాళ్లు మరణించినప్పుడు, కాన్పుల సమయంలో మాత్రమే పోలీసుల అనుమతి ఇస్తున్నారు. ఇక ఇదే సమయంలో మరికొందరు మాత్రం తప్పుడు సమాచారంతో సొంతూళ్లకు వెళ్తేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అత్యవసరం ఉందంటూ తెలిసిన వైద్యులతో లెటర్ రాయించుకునిమరీ పోలీసుల వద్దకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు పోలీసులు. అటు కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ఇటు విధుల్లో ఎదురవుతున్న సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది.