ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థి, కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ చంద్రమౌళి కన్నుమూశారు. గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ రోజు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్లో మృతిచెందారు. ఆయన రిటైరయ్యాక రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో పనిచేస్తూ ఆయనపై పోటీ చేసేందుకు ఉత్సుకత చూపారు.
కుప్పంలో గెలవడం కష్టం అని తెలిసి కూడా చంద్రమౌళి ఆయనపైనే సవాల్ చేసి మరీ పోటీ చేశారు. ఎన్నో ఏళ్లు ధైర్యంగా అక్కడ పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన తొలి మూడు రౌండ్లలో చంద్రబాబుపై ఆధిక్యం కనపరిచి పెద్ద సంచలనం రేపారు. ఏడాదికాలంగా ఆయన కాన్సర్ తో ఇబ్బంది పడ్డారు. ఆయన అస్వస్థత తెలిసినా, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఆయన మీద గౌరవంతో టిక్కెట్ ఆయనకే ఇచ్చారు. ఇక గత ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం కూడా చేయలేదు. అయినా చంద్రబాబుకు ఆయన గట్టి పోటీ ఇచ్చారు.