దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో కరోనా వైరస్ రెచ్చిపోతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఏకంగా 2,120 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 121కి చేరుకుంది. ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఆస్పత్రులలో కరోనా పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యసిబ్బంది, లాక్డౌన్ అమలులో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులు కూడా ఎక్కు సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఈ పరిణామాలతో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,300కుపైగా ఉండడం గమనార్హం. దేశంలోనే ఈ రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
ఇక జాతీయ మరణాల సగటు రేటు మహారాష్ట్రలో సగటు మరణాల రేట్ రెట్టింపుగా ఉండడం గమనార్హం. జాతీయ సగటు మరణాల రేట్ 3.26గా ఉంటే.. మహారాష్ట్రలో సగటు మరణాల రేట్ 6.05గా ఉండడంతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముంబైలోని ధారావి( ఆసియాలో అతిపెద్ద మురికివాడ) కరోనావైరస్ కేసుల సంఖ్య 100 మార్కును దాటింది. కొత్తగా 15 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 10 మంది మరణించారు. ఈమురికి వాడలో సుమారు 8లక్షల మంది నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. మహమ్మారి ప్రభావం మాత్రం అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది.