కరోనా వైరస్పై పోరుకు రంగంలోకి దిగుతున్న బృందానికి భారత సంతతికి చెందిన నోబెల్ గ్రహీత, యూకే రాయల్ సొసైటీ చైర్మన్, ప్రొఫెసర్ వెంకీ రామకృష్ణన్ సారథ్యం వహిస్తున్నారు. యూకే చెందిన కొవిడ్-19 నిపుణుల బృందానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. కరోనా అంతర్జాతీయ గణాంకాలను విశ్లేషించి.. దాని వ్యాప్తిని అరికట్టేందుకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించి.. సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనడంపై ది రాయల్ సొసైటీ నియమించిన కమిటీ దృష్టి సారించింది. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణపై అధ్యయనం చేసి, అవసరమైన ప్రణాళికను రూపొందించడం, దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనడం వెంకీ రామకృష్ణన్ సారథ్యంలోని బృందం పని.
తమిళనాడులో జన్మించిన 67 ఏళ్ల రామకృష్ణన్ జీవశాస్త్రవేత్త. 2009లో కెమిస్ట్రీకి నోబెల్ బహుమతిని కూడా పొందారు. కరోనాను తరిమికొట్టేందుకు అసవరమైన శాస్త్రీయ విధానాలను రూపొందించే బాధ్యత భారత సంతతికి చెందిన వెంకీ రామకృష్ణన్కు దక్కడంపై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సారథ్యంలోని బృందం విజయం సాధించాలని, కరోనా నుంచి మానవాళిని కాపాడాలని ఆకాంక్షిస్తున్నారు.