మే 3వ తేదీ తర్వాత కూడా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను పొడిగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందా..? కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ఈ దిశగా అడుగులు వేస్తోందా..? నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో జరిగిన సమాశంలో పలువురు మంత్రులు ఇదే విషయాన్ని చెప్పారా..? ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ ఒక్కటే భారత్ను కాపాడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారా..? అంటే పలువురు విశ్లేషకులు మాత్రం ఔననే అంటున్నారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తుండగానే 20వేల వైపుగా పరగులు తీస్తోంది. రోజుకు సగటున వెయ్యి కేసులు నమోదు అవుతున్నాయి.. అంటే.. మే 3వ తేదీ వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేగాకుండా.. రోజురోజుకూ వైరస్ కొత్తకొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ను ఎత్తివేస్తే.. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్నాథ్ నిర్వహించిన సమావేశంలోనూ మెజార్టీ మంత్రులు ఇదే విషయాన్నిచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్తో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటూ దానిని కొనసాగించేందుకు అవసరమైన ప్రణాళికలను రచించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న విధానాన్ని ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. అనేక దేశాలకు భారత్ మార్గదర్శకంగా నిలుస్తోంది. మే 3వ తేదీలోపు పరిస్థితి అదుపులోకి రాకుంటే లాక్డౌన్ పొడిగింపునకే ప్రధాని మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దేశంలోని ప్రధాన నగరాల్లోనే కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశరాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై కరోనాతో అల్లాడుతున్నాయి. ఇంకా హైదరాబాద్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇలా అనేక నగరాల్లో కొవిడ్-19కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో లాక్డౌన్ను పొడిగించడం తప్ప కేంద్రం ముందు మరోమార్గం లేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్లో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు 16,365కి చేరుకున్నాయి ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 521కు చేరుకుంది. 2వేల మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 3,648 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో దేశ వాణిజ్యరాజధాని ముంబైలో వైరస్ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులలో సుమారు 2500కుపైగా ముంబైలోనే నమోదు కావడం గమనార్హం. ఈ పపరిణామాలు ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారు.