కరోనా వైరస్ను ప్రకృతి సృష్టించలేదని, అది మానవ సృష్టేనని, అదికూడా చైనాలోని వుహాన నగరం కేంద్రంగానే జనించిందనే అనుమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా చైనాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి నుంచీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటు చైనాపై, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థపై అనుమానం, ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఒక దశలో కరోనాను చైనీస్ వైరస్ అని కూడా అన్నారు. ఫ్రెంచ్ వైరాలజిస్ట్, మెడిసిన్ నోబెల్ గ్రహీత మెంటాగ్నియర్ నిన్న ఓ న్యూస్ చానెల్తో మాట్లాడుతూ.. కరోనా చైనాలోని వుహాన్లో ఉన్న ల్యాబ్లోనే పుట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అదనుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మరోసారి చైనాపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆదేశ విదేశాంగ కార్యదర్శి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ ఎలా పుట్టిందో.. ఎలా వ్యాపించిందో.. ఎంతమందిని బలిగొంటుందో.. అంతా అమెరికాకు తెలుసునని.. దీనిపై అమెరికా దర్యాప్తు చేస్తోందని అన్నారు. ఇక తాజాగా.. ఆస్ట్రేలియా కూడా స్పందించింది. చైనాపై అనుమానాలు వ్యక్తం చేసింది, కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై అంతర్జాతీయంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇదే దారిలో మరికొన్ని దేశాలు కూడా కదిలే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చైనాపై ఒత్తిడి పెరగడం ఖాయమని.. దీనిపై మరికొన్ని రోజుల్లోనే కీలక అంశాలు బయటకు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. వైరస్లకు దేశాలు ఉండవనీ.. సరిహద్దులతో వాటికి సంబంధం ఉండదనీ.. కరోనా వైరస్ ప్రకృతి సృష్టేనని గతంలోనే స్పష్టం చేసింది.