కరోనా కట్టడికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైరస్ వ్యాప్తి ని అరికట్టేందుకు ప్రధాని నిర్ణయం కంటే ముందే రాష్ట్రంలో లాక్డౌన్ ను మే 1 వ తేదీ వరకు పొడిగించిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. తాజాగా కోవిడ్-19పై సమర్ధవంతంగా పోరాడేందుకు ఒడిశా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిల్లో సర్పంచ్లకు జిల్లా కలెక్టర్లకు ఉండే అధికారాలను ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం తెలిపారు.
'వెనక్కి తిరిగి వచ్చేవారికి, వారి కుటుంబాలకు 14 రోజుల క్వారంటైన్ అనేది చాలా ముఖ్యం. దీనిని సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఒడిస్సా కోవిడ్ రెగ్యులేషన్స్ 2020, ఎపిడమిక్ డిసీజెస్ చట్టం 1897 కింద గ్రామ పంచాయతీల సర్పంచులకు జిల్లా కలెక్ పవర్లు ఇస్తున్నాం' అని నవీన్ పట్నాయక్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి, తిరిగి స్వరాష్ట్రానికి రావాలనుకుంటున్న ఒడిశా వాసులను లాక్డౌన్ కాలం ముగియగానే వెనక్కి తీసుకువస్తామని ఆయన చెప్పారు. వాళ్లు తప్పనిసరిగా తమ తమ పంచాయతీలలో కుటుంబ సభ్యులు, మిత్రుల సహాయంతో పేర్లు రిజిస్టర్ చేయించు కోవాలని, రాష్ట్రానికి తిరిగివచ్చిన తర్వాత 14 రోజులు క్వారంటైన్లో ఉండటం తప్పనిసరి అని వివరించారు.