ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ తగ్గినా కూడా మళ్లీ రాదన్న గ్యారెంటీ కూడా లేదు. ఇదే విషయాన్ని ఇప్పటికే పలువురు నిపుణులు చెప్పారు. తాజాగా దక్షిణ కొరియాలో ఇదే ఘటన చోటుచేసుకుంది. కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారికి మళ్లీ వైరస్ సోకింది. దీంతో అక్కడి ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. దక్షిణ కొరియాలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 179 మందికి మళ్లీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఈ కేసుల్లో అత్యధికులు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ కొరియా ఘటనతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి. వైరస్ నుంచి కోలుకున్న వారికి మళ్లీ వైరస్ సోకడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. నిజానికి.. పలు మార్లు పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ అని వచ్చిన తర్వాతనే వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. కొద్దిరోజుల తర్వాత వారికి పరీక్షలు నిర్వహించగా మళ్లీ వైరస్ సోకడంతో ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అధికారులు.