తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో సోమవారం సాయంత్రం నాటికి కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 872కు చేరింది. ఈరోజు నమోదు అయిన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 12, మేడ్చల్లో ఒకటి, నిజామాబాద్ జిల్లాలో మరో కేసు నమోదైంది. సోమవారం ఇద్దరు మరణించడంతో వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 23కు చేరుకుంది. 186 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 677 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 722కు చేరుకుంది. వీరిలో 92 మంది డిశ్చార్జ్ కాగా, 20 మంది మరణించారు. ప్రస్తుతం 610 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం అనంతపురంలో కొత్తగా 4, చిత్తూరులో 25, తూర్పు గోదావరిలో 2, గుంటూరులో 20, కడపలో 3, క్రిష్ణాలో 5, కర్నూలులో 16 కేసులు నమోదయ్యాయి. ఇక నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.