కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అనేక సేవలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం అయిపోయారు. అడుగుబయటపెట్టే అవకాశం లేకుండా పోయింది. కేవలం నిత్యావసర, అత్యవసర పనులకు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం రంగ సంస్థలేకాదు.. ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నాయి. ప్రధానంగా ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.
ఈ క్రమంలోనే వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా వాయిస్ బ్యాంకింగ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాయిస్ కమాండ్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్, క్రెడిట్కార్డు వివరాలతోపాటు అనేక సేవలను పొందవచ్చునని ఆ బ్యాంకు తెలిపింది. ఇందుకోసం అమెజాన్ అలెక్సా లేదా.. గూగుల్ అసిస్టెంట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. వీటి ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ను లింక్ చేసుకుని సేవలను పొందవచ్చునని పేర్కొంది