కరోనా వైరస్పై పోరులో అనేక మంది భాగస్వాములవుతున్నారు. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది.. తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజాసేవకే అంకితం అవుతున్నారు. ఇదే సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు కూడా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆనంద్ సింగ్ బిష్ట్(89) సోమవారం ఉదయం మరణించారు. తండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా ముఖ్యమంత్రి యోగి ప్రజాసేవకు అంకితమయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను అంత్యక్రియలకు రాలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ మంది హాజరుతో, అంత్యక్రియలు పూర్తి చేయాలని తన తల్లి, కుటుంబ సభ్యులను కోరినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదే సమయంలో ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. * నాన్న నిజాయితీతో, నిస్వార్థతతో దేశభక్తితో పనిచేయడం నాకు నేర్పించారు. నాన్నను చివరిసారిగా చూడాలనే ఉంది. కానీ యూపీకి చెందిన 23 కోట్ల మందికి కాపాడడానికి కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడే బాధ్యత నాపై ఉంది. అందుకే నాన్నను చూడలేకపోతున్నా* అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. నిజానికి.. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో సీఎం యోగి సమావేశం నిర్వహిస్తున్నప్పుడు తండ్రి మరణించినట్లు సమాచారం అందింది. అయినా.. సమావేశం అలాగే కొనసాగించారు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్.