కరోనా మహమ్మారి దెబ్బకు ముడిచమురు ధర పాతాళానికి పడిపోయింది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్- నైమెక్స్లో లైట్ స్వీట్ క్రూడ్(డబ్లూటీఐ) బేరల్ మే నెల కాంట్రాక్ట్ ధర సోమవారం అమాంతంగా కుప్పకూలిపోయింది. మైనస్ 28 డాలర్ల స్థాయికి పడిపోయింది. క్రూడ్ ధర ఇంతదారుణంగా పడిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు అంటున్నారు. కరోనా కట్టడికి అనేక దేశాలు లాక్డౌన్ అమలు చేస్తుండడంతో చమురుకు డిమాండ్ దాదాపు పూర్తి తగ్గిపోయింది. ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. ఇది ఎక్కడికి దారితీసిందంటే.. తమ ముడిచమురు నిల్వలను తగ్గించుకునేందుకు ఉత్పత్తిదారులే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీ పూర్తి స్థాయిలో నిండుగా ఉండడంతో ఉత్పత్తి తగ్గించి.. డిమాండ్ పెంచాలన్నా పెంచలేని పరిస్థితి ఏర్పడింది. 7.4 బిలియన్ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. 1999 జనవరిలో క్రూడ్ కనిష్ట స్థాయి: 11.72 డాలర్లు. 2008 జూన్ క్రూడ్ ఆల్టైమ్ గరిష్టం: 147.67 డాలర్లు, 2020 ఏప్రిల్ 20న క్రూడ్ కనిష్ట స్థాయి: మైనస్ 28 డాలర్లు. ఈ దారుణమైన పరిస్థితులు మెరుగుపడాలంటే.. చాలా ఏళ్లే పడుతుందని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.