కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఓవైపు వైరస్ వ్యాప్తి నియంత్రణకు పకడ్బందీ ప్రణాళికలను అమలు చేస్తూనే, మరోపక్క లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకుంటోంది. లబ్ధిదారుల ఇళ్లకే రేషన్ సరుకులు అందించడంతో పాటు, మాస్కుల పంపిణీని అమలు చేస్తోంది. తాజాగా కరోనా విపత్కర పరిస్థితుల్లో అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. లాక్ డౌన్ నేపథ్యంలో వారందరికీ రూ. 5వేల ఆర్థిక సాయం అందించాలని దేవాదాయశాఖ, వక్ఫ్బోర్డు, క్రిస్టియన్, మైనార్టీ కార్పొరేషన్లకు జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ డబ్బును నేరుగా అర్హుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. కాగా ప్రభుత్వం , సంబంధిత మత సంస్థల నుంచి జీతం, ఉపకారం వేతనం తీసుకునే వారు మాత్రం అర్హుల కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో రిజస్టర్ అయిన మసీదులవారికే కాకుండా, రిజిస్టర్ కాని మసీదుల్లోని వారికి వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.