కరోనా మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అగ్ర రాజ్యం ఆర్థిక వ్యవస్థ ఆగమాగం అవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు, అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడుకునేందుకు తమ దేశంలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. రోవైపు కరోనా వైరస్కు సంబంధించి చైనాపై ట్రంప్ నిప్పులు చెరుగుతున్నారు. ఈ మేరకు ఉత్తర్వులపై ఆయన సంతకం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ ఎక్కడ? ఎలా? పుట్టుకొచ్చిందో కనిపెట్టేందుకు చైనాకు నిపుణుల బృందం పంపనున్నట్లు ట్రంప్ సోమవారం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కరోనా విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆయన మరోమారు అసహనం వ్యక్తం చేశారు. ఇంతటి కష్టకాలంలోనూ అమెరికాను ఆదుకునేందుకు జిన్పింగ్ ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. కాగా, ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 7.75 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 42 వేలకు పైగా మృతిచెందారు.