గుజరాత్ ముఖ్యమంత్రి విజయ రూపానికి ఏపీ సీఎం జగన్ ఫోన్ చేశారు. గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులకు భోజనం, వసతి సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ అమలు చేస్తుండడంతో ఏపీకి చెందిన అనేక మంది మత్స్యకారులు గుజరాత్లోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని, వారికి వసతి, భోజనం సదుపాయం కల్పించాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారు.
తెలుగు మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని, వారికి అన్ని వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఏపీకి చెందిన మత్స్యకారులు చేపల వేటలో భాగంగా గుజరాత్ ప్రాంతానికి వెళ్తుంటారు. అక్కడే సుమారు రెండు మూడు నెలలపాటు ఉంటారు. ఇంతలోనే లాక్డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి రాగానే.. స్వయంగా రంగంలోకి దిగారు. తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రిని కోరడంతో మత్స్యకార కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.