ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధానంగా కరోనా బారిన పడుతున్న వైద్య సిబ్బంది ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉంటున్నారు. తాజాగా.. పుణెలోని రుబీ హాల్ క్లినిక్ సిబ్బంది కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది. ఏకంగా 19మంది నర్సులు, మరో ఆరుగురు ఇతర సిబ్బందికి వైరస్ సోకింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన అధికారులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారు ఎవరెవరు కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇతర సిబ్బందిని మొత్తం క్వారంటైన్లో ఉంచారు. కాగా, ముంబైలోని ఓ ఆస్పత్రిలో కూడా ఇటీవల ఏకంగా 26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాలతో వైద్యవర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. అయితే.. తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రంలో ఇప్పటివరకు 4666 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ముంబై నగరంలోనే 3వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 223మంది మరణించారు. ఇందులో ముంబైలోనే 133మరణాలు సంభవించాయి.